Thursday, August 1, 2019

సుమతీ శతకం (Sumathi Shathakam) - 16

సుమతీ శతకం (Sumathi Shathakam) - 16

వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలోసుమతీ!


భావం:-
మంచిబుద్ధికలవాడా! ఎవరు ఏమి చెప్పినా దానిని శ్రద్ధగా వినాలి. అయితే విన్న వెంటనే తొందరపడి ఒక నిశ్చయానికి రాకూడదు. బాగా ఆలోచించి తెలుసుకొని, ఆ చెప్పిన విషయం అసత్యమో, సత్యమో అని ఎవరు తెలుసుకుంటారో వారు నీతి తెలిసినవారు.

సుమతీ శతకంలో ఇది బాగా ప్రసిద్ధిచెందిన పద్యం. తరచుగా ఈ పద్యాన్ని అందరూ వాడుతుంటారు. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు దానిని శ్రద్ధగా వినాలి. అవతలి వారికేం తెలియదు అనుకోకూడదు. విన్న తరవాత తొందరపడి ఆ విషయం మీద ఒక నిర్ణయానికి రాకూడదు. వారు చెప్పిన విషయంలో ఎంత నిజం ఉందో, ఎంత అబద్ధం ఉందో ముందుగా తెలుసుకోవాలి. ఎవరైతే అలా తెలుసుకోగలుగుతారో వారిని నీతిపరులుగా చెప్తారు. తొందరపాటుతనం ఉండకూడదని బద్దెన ఈ పద్యం ద్వారా నీతిని బోధించాడు. తొందరపడి నిర్ణయం తీసుకుంటే అప్పుడు నష్టపోవడమేకాక, ఆ తరవాత కూడా బాధపడవలసి ఉంటుంది.

No comments:

Post a Comment