Wednesday, August 28, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 25

కృష్ణ శతకం (Krishna Shathakam) - 25

వడుగుడవై మూడడుగుల
నడిగితివౌ భళిర భళిర యఖిల జగంబుల్
తొడిగితివి నీదు మేనునన్
గడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!


కృష్ణా అంటే ఓ కృష్ణా నీవు; వడుగుడవై అంటే బ్రహ్మచారివై; మూడు + అడుగులన్ అంటే మూడు పాదములు మోపునంత స్థలాన్ని; అడిగితివి అంటే కోరుకున్నావు; నీదు అంటే నీయొక్క; మేనునన్ అంటే శరీరంలో; అఖిల అంటే సమస్తమైన; జగంబుల్ అంటే లోకాలను; తొడిగితివి అంటే ఆక్రమించావు; (అన్ని లోకాలను ఆక్రమించావు) ఔను అంటే వాస్తవము; భళిర భళిర అంటే ఆహా! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం; నీ చరిత్ర అంటే నీ గొప్పదనాన్ని చెప్పే కథ; కడు చిత్రము అంటే చాలా చిత్రమైనది; ఘనము + అవు అంటే గొప్పది అగును కదా!

ఓ శ్రీకృష్ణా! వామనుడిగా మూడడుగుల నేలను దానంగా ఇమ్మని అడిగి, రెండు అడుగులతో సమస్త లోకాలనూ ఆక్రమించిన నీ చరిత్ర చాలా గొప్పది, ఆశ్చర్యాన్ని కలిగించేదీనూ.

వామనావతారంలో విష్ణుమూర్తి బహ్మచారిగా సాక్షాత్కరించి, రాక్షస రాజైన బలిచక్రవర్తి నుంచి మూడడుగుల దానం స్వీకరించబోగా, వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని రాక్షసగురువు శుక్రాచార్యుడు చెప్పినప్పటికీ, వినకుండా బలిచక్రవర్తి దానం చేస్తాడు. రెండడుగులతో లోకాలన్నిటినీ ఆక్రమించి, మూడవ అడుగు ఎక్కడ ఉంచాలని బలిచక్రవర్తిని అడిగినప్పుడు, తన తల మీద ఉంచమని చెప్పిగా బలిని పాతాళానికి పంపాడు. కవి ఈ పద్యంలో వామనావతారాన్ని వివరించాడు.

No comments:

Post a Comment