Wednesday, August 28, 2019

కృష్ణ శతకం (Krishna Shathakam) - 24

కృష్ణ శతకం (Krishna Shathakam) - 24

కెరలి యఱచేత కంబము
నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్
ఉదరము జీరి వధించితివి
నరహరి రూపావతార నగధర కృష్ణా!


భావం:-
కొండను ధరించిన వాడవైన ఓ కృష్ణా! రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో కోపంగా... ఈ స్తంభంలో విష్ణువుని చూపుతావా అంటూ ఉక్కు స్తంభాన్ని అరచేతితో గట్టిగా చరచగా నువ్వు నరసింహావతారం ధరించి, ఆ స్తంభంలోనుంచి బయటకు వచ్చి, హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపావు.

హిరణ్యకశిపుడు తపస్సు చేసి చావులేని వరం కోరుకున్నాడు. ఇంటిలోపల బయట... పగలురాత్రి... మనుషులుజంతువులు... ఇలా ఎన్నో వాటి కారణంగా మరణం లేని వరాన్ని పొందాడు. అందువల్ల విష్ణుమూర్తి పగలు రాత్రి కాని మధ్యాహ్న సమయంలో, ఇంటిలోపల బయట కాని గడపమీద, మనిషిజంతువు కాని నరసింహాకారంలో స్తంభంలో నుంచి బయటకు వచ్చి తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుని వధించాడు. నరసింహావతారం గురించి కవి ఈ పద్యంలో వివరించాడు.

నరహరి అంటే మనిషి, సింహం; రూప + అవతార అంటే రూపంలో అవతరించినవాడా; నగధర అంటే కొండను ధరించువాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; కెరలి అంటే క్రోధంతో; అఱచేతను అంటే అరచేతితో; కంబమున్ అంటే స్తంభాన్ని; అరుదుగ అంటే ఎప్పుడూ లేనట్లుగా; వేయుటకు అంటే కొట్టటం చేత; వెడలి అంటే ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి; ఆ + అసుర + ఈశ్వరునిన్ అంటే ఆ రాక్షసరాజయిన హిరణ్యకశిపుని; ఉదరము అంటే వక్షస్థలాన్ని; చీరి అంటే రెండుగా చీల్చి; వధించితివి అంటే చంపావు.

No comments:

Post a Comment