Friday, August 9, 2019

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 10

భాస్కర శతకం (Bhaskara Shatakam) - 10

శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగ వత్తురు తారు దారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగము చేసి; రత్ననిల యుండని కాదె సమస్త వాహినుల్
సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!


భావం :-
ఓ సూర్యభగవానుడా! సముద్రం విలువైన రత్నాలను కలిగి ఉన్న కారణంగా నదులన్నీ సముద్రంలో కలవటానికి ఉత్సాహం చూపుతాయి. అదేవిధంగా సామాన్య మానవులు తమకు కలిగిన నష్టాలనుంచి బయటపడటం కోసం ధనవంతుని ఆశ్రయిస్తారు. ఇది సృష్టి ధర్మం.


ప్రతిపదార్థం :-
ముని సన్నుత అంటే ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే మునులచే ప్రశంసలు పొందిన; సద్గురుమూర్తి అంటే గురువుతో సమానమైన; భాస్కరా అంటే ఓ సూర్యభగవానుడా; దూరాగమన ప్రయాసమునకున్ అంటే ఎంతో దూరం నుంచి ఇక్కడకు రావటం వలన కలిగిన అలసటను; ఓర్చియున్ అంటే భరించి; నిల్వన్ అంటే నిలబడటానికి; ఉద్యోగము చేసి అంటే ప్రయత్నం చేసి; తారుదారి అంటే తమ ఇష్టముతో; అచటన్ అంటే ఆశతో; శ్రీగల భాగ్యశాలిన్ అంటే సంపదలు కలిగి ఉన్న ధనవంతుని; కడున్ అంటే మిక్కిలి; చేరగవత్తురు అంటే ఆశ్రయిస్తారు; సమస్త వాహినుల్ అంటే నదులన్నీ; సాగరున్ అంటే సముద్రంలో; చేరుటెల్లన్ అంటే కలవటం; రత్ననిలయుండని కాదె అంటే అత్యంత విలువైన రత్నరాశులన్నీ తనలో కలిగి ఉన్నాడనే కదా!


ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపదను తీర్చగలవానిని ఆశ్రయిస్తే ఉపయోగం ఉంటుంది. అలా కాక మరో ఆపదలో ఉన్నవారిని ఆశ్రయించటం వల్ల ప్రయోజనం ఉండదు. నదులన్నీ సముద్రంలోనే చేరటానికి కారణం, సముద్రుడు రత్నాకరుడు కావటమే. అంటే ఎప్పుడైనా సరే మన కంటె అధికస్థాయిలో ఉన్నవారినే ఆశ్రయించాలి. విద్యలో సందేహాలు కలిగినప్పుడు పండితులను ఆశ్రయిస్తే సందేహనివృత్తి లభిస్తుంది. అంతేకాని చదువురాని అజ్ఞానిని అడగటం వల్ల ఉపయోగం ఉండదని కవి ఈ పద్యంలో వివరించాడు.

No comments:

Post a Comment